తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలో డయాలసిస్ సేవలను విస్తరించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుతో పాటు, ప్రస్తుతం ఉన్న వాటిలో అదనపు బెడ్లను సమకూర్చే ప్రక్రియ ప్రారంభమైంది.
కొత్తగా లక్షెట్టిపేట్, వేమనపల్లి, భీమిని సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒక్కొక్కదానికి ఐదు డయాలసిస్ బెడ్లు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన త్రీ-మెన్ కమిటీ వివిధ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి, ఏర్పాట్లపై సమీక్షించింది.
కమిటీ సభ్యులు లక్షెట్టిపేట, భీమిని, వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించి, డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది లభ్యత వంటి అంశాలను అంచనా వేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత, ఆర్.ఎం.ఓ. డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఆకుల శ్రీనివాస్, డాక్టర్ అప్పల ప్రసాద్, డి.పి.ఓ. ప్రశాంతి, నర్సింగ్ అధికారులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వైద్యులు, సాంకేతిక సిబ్బంది, పరీక్షా సౌకర్యాలు, నీటి సరఫరా, రోగుల బంధువులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కమిటీ దృష్టి సారించింది. ఈ నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. ఈ విస్తరణతో జిల్లాలోని డయాలసిస్ రోగులకు మెరుగైన, అందుబాటు ధరల్లో వైద్య సేవలు లభించే అవకాశం ఉంది.












