మంచిర్యాల నగర కార్పొరేషన్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అనుమానితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేలా సీసీ కెమెరాల వినియోగం తప్పనిసరి చేస్తూ, రాత్రిపూట గస్తీని పెంచుతున్నట్లు మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ శుక్రవారం తెలిపారు.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, జ్యువెలరీ షాపులు, లాడ్జిలు, రెసిడెన్సీల నిర్వాహకులు తప్పనిసరిగా తమ ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని, సీసీ కెమెరాల ద్వారా లోపలి, బయటి దృశ్యాలను రికార్డ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా జ్యువెలరీ షాపుల్లో కొత్త వ్యక్తులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలను సేకరించి, ధృవీకరించుకున్న తర్వాతే పనిలో పెట్టుకోవాలని సూచించారు.
లాడ్జిలు, రెసిడెన్సీలలో అనుమానిత లేదా అజ్ఞాత వ్యక్తులకు గుర్తింపు కార్డు లేకుండా గదులను కేటాయించవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కఠిన నిబంధనల ద్వారా దొంగలు, స్మగ్లర్లు, కిడ్నాపర్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు.
నేరాల నియంత్రణకు సమగ్ర రక్షణ వ్యవస్థను 'అష్టదిగ్బంధనం'గా ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు సీఐలు ప్రమోద్ రావు, అశోక్ కూడా పాల్గొన్నారు.











