అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా మంచిర్యాల పట్టణంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బందికి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారికి ఉచిత వైద్య, కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు.
మే 4న నిర్వహించిన అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవాన్ని పురస్కరించుకుని, లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మంచిర్యాల అగ్నిమాపక కార్యాలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ భగవాన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
లైన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ తరపున అగ్నిమాపక సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం, ముఖ్య అతిథి భగవాన్ రెడ్డితో పాటు ఇతర సిబ్బందిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం చైర్ పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, అధ్యక్షులు లయన్ కారుకూరి చంద్రమౌళి మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడటంలో అగ్నిమాపక సిబ్బంది చూపించే ధైర్యసాహసాలను ప్రశంసించారు. వారి సేవలను గుర్తించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా, వివిధ ప్రమాదాలలో అమరులైన అగ్నిమాపక సిబ్బందికి నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. భగవాన్ రెడ్డి వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.












