మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 27
మంచిర్యాల నగరంలోని రెడ్డి కాలనీలో పట్టా భూములలో నిర్మించుకున్న ఇళ్లను పొరపాటున నిషేధిత జాబితాలో చేర్చారని, వాటిని తొలగించాలని స్థానిక అధికారులు, ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు 48వ డివిజన్ కార్పొరేటర్ తరపున మాజీ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్, స్థానికులు తహసిల్దార్ కు వినతిపత్రం అందించారు.
మంచిర్యాల నగరంలోని కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ, పరంపోగు, లావనీ పట్టా భూములలో ఉన్న ఖాళీ స్థలాలు, నివాస గృహాలను డోర్ నెంబర్లతో సహా నిషేధిత జాబితాలో ప్రకటించినప్పుడు, పట్టా భూములలో నివాసాలు ఏర్పరచుకున్న వాటిని కూడా పొరపాటున చేర్చడం జరిగిందని, వాటిని మరోసారి సర్వే జరిపి తొలగించాలని స్థానిక తహసిల్దార్ గారికి 48వ డివిజన్ కార్పొరేటర్ తరపున మాజీ కౌన్సిలర్ వేములపల్లి సంజీవ్, స్థానికులు కలిసి వినతిపత్రం అందించారు.
సర్వే నెంబర్లలో గందరగోళం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ రెడ్డి కాలనీలో సర్వే నెంబర్లు 197, 423, 426 లను పేర్కొంటూ, ఇంటి నెంబర్లతో సహా నిషేధిత జాబితాలో ప్రకటించడం జరిగింది. అయితే, రెడ్డి కాలనీలో సర్వే నెంబర్ 194 (చాలా భాగం పట్టా భూమి, కొంత భాగం ప్రభుత్వ భూమి) మరియు సర్వే నెంబర్ 195 పూర్తి పట్టా భూములు కలవు. ఈ సర్వే నెంబర్లలో గత కొన్ని ఏండ్ల క్రితం రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసి, మున్సిపాలిటీ నుంచి అనుమతి పొంది ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నవారు, నాటి నుంచి పన్నులు కూడా చెల్లిస్తున్నారు.
నివాసితుల ఆందోళన
అయితే, 194, 195 సర్వే నెంబర్లలో నిర్మించుకున్న ఇళ్లను పొరపాటున సర్వే నెంబర్లు 197, 426 పరిధిలోనివిగా నిషేధిత జాబితాలో చూపించడం జరిగింది. దీనివల్ల పట్టా భూములలో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నవారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కావున, తమరు మరోసారి సర్వే జరిపించి, పట్టా స్థలాలలో నిర్మించుకున్న ఇళ్లను, వాటి డోర్ నెంబర్లతో సహా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వినతి పత్రంలో కోరడం జరిగింది.












