మండల పరిషత్ దుకాణ సముదాయం సమీపంలో నాలుగు రోజులుగా నిరాశ్రయురాలైన వృద్ధురాలికి జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కె.లలితా కుమారి చొరవతో ఆశ్రయం లభించింది. స్థానికుల సమాచారం మేరకు అధికారులు స్పందించి, వృద్ధురాలిని అమీన్పూర్లోని మహిమ మినిస్ట్రీస్ వృద్ధుల ఆశ్రమానికి తరలించారు.
మండల పరిషత్ దుకాణ సముదాయం సమీపంలో ఒక వృద్ధ మహిళ నాలుగు రోజులుగా ఆశ్రయం లేకుండా ఉంటోందని స్థానికులు శనివారం మధ్యాహ్నం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అక్కడే ఉంటుండగా, పరిసర ప్రాంతాల వారు మానవతా దృక్పథంతో భోజనం అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కె.లలితా కుమారి వెంటనే స్పందించారు. వృద్ధురాలికి సురక్షితమైన ఆశ్రయం కల్పించాలని జిల్లా ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్ను ఆదేశించారు.
అధికారి ఆదేశాల మేరకు సతీష్తో పాటు కార్యాలయ సిబ్బంది వృద్ధురాలి వద్దకు చేరుకున్నారు. ఆమెకు భోజనం అందించడంతో పాటు తగిన దుస్తులు సమకూర్చారు. అనంతరం సిబ్బంది సహాయంతో అమీన్పూర్లోని మహిమ మినిస్ట్రీస్ వృద్ధుల ఆశ్రమానికి తరలించారు. వృద్ధురాలికి ఆశ్రయం కల్పించేందుకు తక్షణమే స్పందించిన జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వీణా, ప్రమీల, జబ్బర్, అల్తాఫ్ తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.











