సంగారెడ్డి, 10 September
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతే మహా గణపతి నినాదంతో సంగారెడ్డిలో వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ఏడాది 5016 మట్టి వినాయకులను సిద్ధం చేయగా, వీటిని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆవిష్కరించారు.
వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ సంగారెడ్డి పట్టణంలో వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ బృందం ద్వారా గత 18 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని కాపాడడం కోసం "మట్టి గణపతే మహా గణపతి" అనే నినాదంతో దాదాపు 5000 మట్టి వినాయకుల ప్రతిమలను సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఉచితంగా అందజేస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా 5016 మట్టి వినాయకులను పంపిణీ చేయడానికి సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడానికి వాసవి ఇల్లు సంస్థ వారు చేస్తున్న ఈ కృషి అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్, జిల్లా జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు బండారు యాదగిరి, సంస్థ ఉపాధ్యక్షులు మ్యాడమ్ రాధాకిషన్, ఆమేటి మహేందర్, కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, సభ్యులు నామా భాస్కర్, జూలకంటి మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.












